Thursday, 15 September 2016

వినియోగదారులకు - ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకే షాపింగ్ చేయచ్చు!


ఇల్లు, ఆఫీసు ఎక్కడున్నా కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో కొనేయడం ఇప్పుడు కామన్ అవుతోంది. ఆఫ్ లైన్ మార్కెట్ల కంటే ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లతో దంచేస్తుంటాయి. పలు రకాల కారణాల వల్ల ఆన్ లైన్ లో కొన్ని చాలా చౌక ధరలకే లభ్యమవుతుంటాయి. కాస్త టైమ్ కేటాయిస్తే ఆన్ లైన్ షాపింగ్ లో ఇంకాస్త ఆదా చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.
 తక్కువ ధర ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలంటే...!
డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, హోంనీడ్స్, హౌస్ కీపింగ్ చివరికి సబ్బులు,  పప్పులు, ఉప్పు కూడా ఆన్ లైన్ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ముందు కొనాల్సినవి ఏంటనేవి అనుకున్న తర్వాత... ఆ  వస్తువు ఏ షాపింగ్ సైట్లలో తక్కువ ధరకు లభిస్తుందో తెలుసునే ప్రయత్నం చేయాలి. బై హట్కే.కామ్ అనే సైట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ అందిస్తోంది. దీనిని డౌన్ లోడ్ చేసుకుంటే... క్రోమ్ బ్రౌజర్ లో మీరు ఒక ఉత్పత్తి గురించి ఏదేనీ ఈ కామర్స్ సైట్ లో చూస్తుంటే... అదే వస్తువు వివిధ సైట్లలో తక్కువ ధరకు లభిస్తోందో ఆటేమేటిక్ గా మేసేజ్ రూపంలో బ్రౌజర్ లోనే చూపిస్తుంది. ఆన్ లైన్ లో ప్రైస్ కంపారిజన్ సైట్లు కూడా ఉన్నాయి. mysmartprice.comshopmania.inwww.compareraja.inవంటివి కొన్ని. ఇంకా చాలానే ఉన్నాయి. 
డిస్కౌంట్ల వివరాలు...
ఫలానా వస్తువు చౌక ఎక్కడో తెలుసుకోవడం పూర్తయితే... ఇప్పుడు ఆయా సైట్ లలో డిస్కౌంట్ లు ఉన్నాయా? లేదా? పరిశీలించాలి. కొన్ని ఇంత శాతమని అదనపు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఒక సైట్ లో ఓ వస్తువు అతి తక్కువగా రూ.100 ఉందనుకుందాం. కానీ ఆ సైట్ లో ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్లు లేవు. అదే వస్తువు రూ. 110 ధర ఉన్న మరో సైట్ లో 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంటే రూ.88కే లభిస్తుంది. అందుకే ఆన్ లైన్ షాపింగ్ లో తెలివిగా వ్యవహరించాలి. 
ప్రైస్ కంపారిజన్ సైట్లు, మొబైల్ రీచార్జ్ సైట్లు కూడా పలు సైట్లకు సంబంధించి డిస్కౌంట్ కూపన్లు అందిస్తుంటాయి. అలాంటివి పరిశీలించాలి. వెబ్ సైట్ లో కంటే యాప్ లో కొంటే కొన్ని మరింత తగ్గింపు ధరలకే అందిస్తుంటాయి. అలాంటి ఆఫర్లు ఉన్నాయేమో సదరు ఈ కామర్స్ సైట్లలో ఆఫర్ల కోసం సెర్చ్ చేయాలి. ఉంటే సంబంధిత ప్రొమో కోడ్ ను వస్తువుకు ధర చెల్లించే ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. అది మరిచిపోతే డిస్కౌంట్ వర్తించదు. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలు అయితే, ఫలానా బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ అంటూ తరచుగా ఆఫర్ చేస్తుంటాయి. ఆయా కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల మరింత ఆదా చేసుకోవచ్చు. ఈబే సంస్థ అయితే, తరచూ ఎంతో కొంత డిస్కౌంట్ కూపన్లు ప్రకటిస్తుంటుంది. పెప్పర్ ఫ్రై సంస్థ రిజిస్టర్డ్ యూజర్లకు డిస్కౌంట్ కోడ్స్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. 
పండుగ సమయాల్లో...
దీపావళి, న్యూ ఇయర్, ఇండిపెండెన్స్ డే, బిగ్ సేల్ డేస్, యాప్ డేస్ పేరుతో ఈ కామర్స్ సైట్లు విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. వెంటనే కొనాల్సిన అవసరం లేకుంటే డిస్కౌంట్ కోసం వేచి చూడవచ్చు. కొన్ని వస్తువులు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పన్నుల్లో మార్పుల కారణంగా తగ్గడం, పెరగడం జరుగుతుంది. అవి కూడా గమనించాలి. ధర తగ్గినప్పుడు మీకు సమాచారం ఇచ్చేందుకు cheapass.inవంటి సైట్లు కూడా ఉన్నాయి. ఆయా సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే ఆ వస్తువు ధర తగ్గిన వెంటనే సమాచారం వస్తుంది. 
ఇదో ట్రిక్!
ఏదైనా వస్తువును కొనాలి అనుకున్నప్పుడు సంబంధిత వస్తువును కొనుగోలు చేసేందుకు షాపింగ్ కార్డ్ కు యాడ్ చేసి అలా ఉంచేయండి. కొన్ని సందర్భాల్లో ఆయా సంస్థలు షాపింగ్ కార్ట్ లో ఉన్నవాటి కొనుగోలు పూర్తి చేసేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తాయి. ఇక మొబిక్ విక్ డాట్ కామ్, పేటీఎం డాట్ కామ్ వంటి సంస్థలు తమ వ్యాలెట్ల ద్వారా (అంటే ముందుగా ఆయా సైట్లలో నమోదు చేసుకుని ఉండాలి) వివిధ సైట్లలో కొనుగోలు చేస్తే ఇంత మొత్తం తగ్గింపును, క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తుంటాయి. మీకు రెండు మూడు ఈ మెయిల్స్ ఉంటే జాక్ పాటే. న్యూ యూజర్లకు అన్ని సైట్లూ తగ్గింపు ఆఫర్లు ఇస్తుంటాయి. అందుకే కొత్త మెయిల్ ఐడీ ద్వారా కొత్త వినియోగదారుడిగా నమోదై డిస్కౌంట్ పొందవచ్చు. 
అవసరం లేకుంటే ఆ వైపు కూడా చూడొద్దు
ఈ కామర్స్ సంస్థల మధ్య విక్రయాల పోటీ తారా స్థాయికి చేరింది. ప్రతీ సంస్థ విక్రయాలు, ఆదాయాలు పెంచుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్ల మోత మోగిస్తుంటాయి. నిజంగా కొనాల్సిన అవసరం ఉంటేనే పైన చెప్పిన చిట్కాలతో తెలివిగా చౌకగా కొనుగోలు చేసుకోవడం సరైనది. అవసరం లేని వస్తువులను ఆఫర్ల మోజులో కొని జేబులు గుల్ల చేసుకోవడం తెలివి అనిపించుకోదు. 

Monday, 12 September 2016

వినియోగదారుల ఫోరం - దరఖాస్తు చాలా సులభం



తక్కువ వ్యయానికే చక్కటి పరిష్కారం… వినియోగదారుల ఫోరం


ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా ఎలాంటి పనైనా...  ఏదో ఒక వస్తువు సాయం ఉంటేనే గానీ పని పూర్తి కాని రోజులివి. అంతలా వస్తువులపై ఆధారపడిపోతున్నాం మరి. అయితే, వేలు, లక్షల రూపాయలు పోసి కొన్న వస్తువు బాగా పనిచేస్తే ఫుల్ ఖుషీ. అలా కాకుండా కొన్ని రోజులకే దాని పని అయిపోతే..? లేదా ఏదైనా కంపెనీ సేవ పేలవంగా ఉంటే..? ఆ కంపెనీ ఆట కట్టించడానికి వినియోగదారులకు అందుబాటులో ఉన్నదే వినియోగదారుల ఫోరం. 
ఎంతో ముచ్చటపడి కొని ఇంటికి తీసుకువచ్చిన ఫ్రిజ్ రెండో రోజే పడకేస్తే ఆ బాధ చెప్పలేనిది.  అలాంటి సందర్భమే ఎదురైతే ముందుగా వినియోగదారుడు సంబంధిత కంపెనీ సర్వీస్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అదీ వారంటీ ఉన్న ఉత్పత్తికి మాత్రమే. అనంతరం కంపెనీ సర్వీస్ ఇంజనీర్లు వచ్చి ఫ్రిజ్ లో తలెత్తిన లోపాన్ని గుర్తించి సరి చేస్తారు. సరిచేయలేనిది అయితే దాని స్థానంలో మరొకదాన్ని సమకూరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా కంపెనీ తనకు సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తే న్యాయం కోసం ఫోరాన్ని ఆశ్రయించక తప్పదు. అయితే, ఫోరాన్ని ఆశ్రయించే ముందు కంపెనీకి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.  
కంపెనీకి నోటీసు
ఫిర్యాదుకు ముందు ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇవ్వాలి. ఉత్పత్తిలో నాణ్యతలేమి, సేవాలోపాలను స్పష్టం చేయాలి. ఎలాంటి పరిష్కారం, ఎన్నిరోజుల్లోపు కోరుకుంటున్నారు? అనే విషయాలను పేర్కొనాలి. భాష హుందాగానే ఉండాలి. అగౌరవమైన పదాలు ఉపయోగించకూడదు. కంపెనీ నుంచి స్పందన రావడానికి గరిష్ఠంగా 30 రోజుల వరకు వేచి ఉంటే సరిపోతుంది. నోటీసులో పేర్కొన్న గడువులోపు సమస్యను పరిష్కరించకుంటే ఫోరాన్ని ఆశ్రయించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేయండి. రిజిస్టర్ పోస్ట్ లో విత్ అక్నాలెడ్జ్ మెంట్ వచ్చే విధంగా నోటీసును పంపించాలి.
నోటీసు అందిన తర్వాత కంపెనీ ప్రతినిధి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఆఫర్ చేయవచ్చు. లేదా ఉచితంగా ఉత్పత్తిని అందిస్తామని, లేదా ఉచిత సర్వీసు అందిస్తామని, ఇంకా వేరే ఆఫర్లు తెలియజేయవచ్చు. కాళ్ల బేరానికి వచ్చారు కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరకూడదు. కంపెనీ ఇస్తున్న ఆఫర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో ఉంటే అంగీకారం తెలిపి ఆ సమస్యకు అక్కడితో ముగింపు పలకడమే మంచింది. ఎందుకంటే వినియోగదారుల ఫోరాలు సైతం ఉత్పత్తి వెలకు తగిన విధంగానే నష్టాన్ని ఇప్పిస్తుంటాయి. కంపెనీ ఆఫర్ నచ్చకుంటే న్యాయపోరాటం ఆరంభించాల్సిందే. 
దరఖాస్తు చాలా సులభం
ఓ తెల్ల కాగితంపై విడి విడి అక్షరాలతో స్పష్టంగా అర్థమయ్యే భాషలో ఫిర్యాదు రాయవచ్చు. టైప్ చేయిస్తే మంచిది. దరఖాస్తులో సమస్య గురించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఉత్పత్తి లేదా సేవకు చెల్లించిన నగదు మొత్తం, ఆ ఉత్పత్తి వివరాలు, ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎదురైన సమస్య, రెండు సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేస్తున్నట్టయితే ఆలస్యానికి గల కారణం తదితర వివరాలను అందించాలి. ఫిర్యాదుకు తోడుగా కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలతోపాటు ఫిర్యాదులో ఉన్న సమాచారం అంతా సరైనదేనని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ ను నోటరీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. 
ఫిర్యాదుకు ఆధారంగా కావాల్సిన అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకోవాలి. కొనుగోలుకు సంబంధించిన బిల్లు, ఇతరత్రా ఏమైనా పత్రం, వారంటీ లేదా గ్యారంటీ కార్డు, నగదు చెల్లించామని చెప్పేందుకు ఆధారం, కంపెనీ సేవా లోపాన్ని రుజువు చేసే ఆధారాలు, కంపెనీ చిరునామా (ఉత్పత్తి ప్యాక్ పై ఉంటుంది లేదా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు)లను పేర్కొనాలి. దరఖాస్తుకు ఈ ఆధారాలన్నీ జత చేయాలి. అన్ని పత్రాలను జిరాక్స్ కాపీల రూపంలోనే సమర్పించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 
ఫిర్యాదులో ఫిర్యాదు దారుడి పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు వివరాలు, అలాగే వ్యతిరేక పార్టీ పేరు, చిరునామా ఇవ్వాలి. ఫిర్యాదులో పరిహారం కోరవచ్చు. అలాగే జరిగిన నష్టం, న్యాయపరమైన ఖర్చులు, వడ్డీ కూడా చెల్లించాలని కోరవచ్చు. ఫిర్యాదును ఐదు కాపీలుగా సమర్పించాలి. మూడు కోర్టు కోసం, ఒకటి ప్రత్యర్థి పార్టీకి, ఒకటి ఫిర్యాదు దారుడికి ఉద్దేశించినది. ఇంకా అదనంగా కావాలంటే అడిగినప్పుడు ఇచ్చేందుకు ముందే సిద్ధంగా ఉంచుకోవాలి. 
ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయడానికి కావాలంటే అక్కడే ఉండే హెల్ప్ డెస్క్ సహకారం కూడా తీసుకోవచ్చు. స్వయంగానూ లేదా ప్రతినిధి లేదా వకీలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానూ ఫిర్యాదు పంపవచ్చు. తమకు తీరిక లేకుండా తమ తరఫున ఓ వ్యక్తిని ప్రతినిధిగా పంపాలనుకుంటే అథరైజేషన్ లెటర్ ఇవ్వాలి. 
కోర్టుకు వెళ్లి క్లర్క్ కు ఇచ్చినట్టయితే ఫిర్యాదును దాఖలు చేసుకుంటారు. మొదటి విచారణ తేదీని కూడా క్లర్క్ చెబుతారు. తర్వాత ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత కంపెనీకి ఫోరం నుంచి నోటీసులు వెళతాయి. ఫోరంలో ఫిర్యాదు దాఖలు అయిన తర్వాత సాధారణంగా నాలుగైదు సార్లు విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. విచారణ సమయంలో వాస్తవాలను విస్పష్టంగా చెబితే సరిపోతుంది. వరుసగా రెండు వాయిదాలకు హాజరు కాకపోతే కోర్టు కేసును నిలిపివేయవచ్చు. 
రుసుము వివరాలు
సాధారణంగా 20 లక్షల రూపాయల విలువ వరకు ఉన్న వస్తువులు, సేవల విషయమైతే జిల్లా వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుంది. 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రాష్ట్ర వినియోగదారుల ఫోరం, అంతకుమించితే జాతీయ వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుంది. రూ.లక్ష వరకు విలువ ఉంటే 100 రూపాయల రుసుం, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య అయితే 200 రూపాయలు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య అయితే 400 రూపాయలు చెల్లించాలి. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 500 రూపాయలు...  అదే విధంగా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ ఉంటే 2,000 రూపాయలు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు 4000 రూపాయలను దరఖాస్తు రుసుం కింద చెల్లించాలి. అలాగే కోటి రూపాయలకు మించిన విలువ అయితే ఫీజు 5 వేల రూపాయలుగా ఉంది. ఈ ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద డీడీ తీయాలనే విషయాన్ని ఫోరం నుంచి తెలుసుకోవచ్చు. 
స్టేట్ కమిషన్
జిల్లా ఫోరాలు ఇచ్చిన తీర్పులపై సంతృప్తి చెందకుంటే రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో అప్పీల్ కు వెళ్లవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగలేదని భావిస్తే జాతీయ కమిషన్ ను ఆశ్రయించవచ్చు. 
సామరస్య పూర్వక పరిష్కారం దిశగా...
కంపెనీల తరఫున వాదించేందుకు లాయర్లు బాగానే వసూలు చేస్తారు. కంపెనీలు 20వేల రూపాయల ఖర్చుతో పోయే ఉత్పత్తికి కేసు విచారణల రూపంలో ఎక్కువ మొత్తం వదిలించుకోవు కదా. అందుకే అవి కాళ్ల బేరానికి వస్తాయి. అదే సమయంలో ఫోరం ద్వారా సమస్య పరిష్కారానికి సమయం పడుతుంది. విలువైన కాలాన్ని అలా హరింపజేసుకునే బదులు ముందే కంపెనీతో సంప్రదింపులు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే నయం కదా. 
హెల్ప్ లైన్
కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కన్జ్యూమర్ హెల్స్ లైన్ నంబర్ ను కూడా ఆశ్రయించవచ్చు. 1800-11-4000 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే తగిన వివరాలు తెలుసుకున్న అనంతరం అక్కడే ఉండే సిబ్బంది సమస్య పరిష్కారానికి తగిన మార్గదర్శనం చేస్తారు. 

పాన్ కార్డుతో మీకు కలిగే ప్రయోజనాలు

పాన్ కార్డు అంటే చాలా మందికి ఏదో తెలియని భయం. పాన్ కార్డుంటే ఆదాయపన్ను శాఖకు పన్ను కట్టాల్సి వస్తుందేమో, రిటర్నులు దాఖలు చేయాలేమో! ఇలా ఎన్నో సందేహాలు, ఆందోళనలతో ఉంటారు. అయితే, వాటన్నింటినీ పక్కన పెట్టి నిశ్చింతగా పాన్ కార్డు తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. 
పాన్ కార్డుంటే పన్ను కట్టాలన్న నిబంధన లేదు. పన్ను వర్తించే ఆదాయంలో ఉన్న వారు మాత్రమే రిటర్నులు దాఖలు చేసి పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను పరిధిలో ఉన్న వారు రిటర్నుల దాఖలకు పాన్ నంబర్ ఎలాగూ తప్పనిసరి. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు చేస్తూ పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న వారు ఎందరో ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు, నల్లధనం చెలామణీని అరికట్టేందుకు ఆదాయపన్ను శాఖకు పాన్ కార్డు నంబర్ ఉపకరిస్తుంది. ఈ నంబర్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం (వివిధ మార్గాల ద్వారా) ఎంత విలువైన లావాదేవీలు జరిగాయో ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలుస్తుంది. 
పాన్ కార్డు వేటికి అవసరం
2016 జనవరి 1 నుంచి ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధన ప్రకారం అమల్లోకి వచ్చిన నిబంధనల మేరకు... ఈ క్రింది వాటన్నింటికీ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 
* 2 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు కొనేవారు పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు 2 లక్షల రూపాయలకు మించిన అన్ని రకాల వస్తువులు, సేవల కొనుగోళ్లు, అమ్మకాలకు పాన్ నంబర్ పేర్కొనాలి. 
* బ్యాంకులో 50వేల రూపాయలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ ఇవ్వాలి. బ్యాంకులోనే కాదు పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకూ ఇదే వర్తిస్తుంది. పోస్టాఫీసు సేవింగ్ ఖాతాలో 50వేలకు మించిన డిపాజిట్ లకు లోగడ్ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా... ఆ నిబంధన తొలగించారు. బ్యాంకులో పాన్ నంబర్ ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. బ్యాంకు డిపాజిట్లపై ఏడాదికి వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు మించితే 20 శాతం (టీడీఎస్) కోత కోసి దాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. పాన్ నంబర్ ఇస్తే ఈ కోత 10 శాతానికే పరిమితం చేస్తారు. పాన్ నంబర్ ఇవ్వని పక్షంలో 20 శాతం టీడీఎస్ కోతకు సంబంధించి బ్యాంకు సర్టిఫికెట్ కూడా ఇవ్వదు. దీంతో ఆదాయపన్ను శాఖ నుంచి రిఫండ్ పొందలేరు. ఫామ్ 15జీ/15హెచ్ ఇచ్చి కోత నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. 
* ద్విచక్ర వాహనం మినహా అన్ని మోటారు వాహనాల కొనుగోలుకూ తప్పనిసరి. 
* రూ.10 లక్షలకు మించి విలువ గల అన్ని ఆస్తి లావాదేవీలకు పాన్ నంబర్ ఇవ్వాలి. లోగడ ఇది రూ.5 లక్షల మొత్తాలకే ఉండేది. 
* అన్ని రకాల బ్యాంకు ఖాతాల ప్రారంభ సమయంలో పాన్ నంబర్ ఇవ్వాలనేది ఇంతకుముందు వరకూ ఉన్న నిబందన. అయితే, సాధారణ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు ఈ  నిబంధన నుంచి తాజాగా మినహాయింపు కల్పించారు. 
* బ్యాంక్ డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులు రూ.50వేలకు మించితే పాన్ ఇవ్వాలి. అలాగే, 50వేలకు మించి నగదు జమలకు కూడా. 
* ఏదేనీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, పాన్ నంబర్ ఉందో లేదో కూడా చూసుకోండి. యాత్రా సంస్థలకు, విమాన ప్రయాణాల చార్జీలు, హోటల్స్ గదుల అద్దెల రూపేణా 50 వేల రూపాయలకు మించి చేసే చెల్లింపులకు పాన్ అవసరం. 
* ముందస్తు చెల్లింపులు, క్యాష్ కార్డుల పేమెంట్ 50వేల రూపాయలు దాటినా పాన్ తప్పదు. 
* అన్ని రకాల టెలిఫోన్, సెల్ ఫోన్ కనెక్షన్లకు పాన్ నంబర్ తప్పని సరి అన్న నిబంధనను తొలగించారు. 
* అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో 50వేలకు మించి చేసే చెల్లింపులకు కూడా పాన్ నిబంధన వర్తిస్తుంది. 
* క్రెడిట్ కార్డుల దరఖాస్తు సమయంలోనూ పాన్ తప్పనిసరి. 
* మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు 50వేల రూపాయలు మించితే ఇదే నిబంధన వర్తిస్తుంది. 
* డీమ్యాట్ ఖాతా ప్రారంభం, అన్ లిస్టెడ్ కంపెనీ షేర్లు లక్ష రూపాయల విలువకు మించి చేసే కొనుగోళ్లు, విక్రయాలకు కూడా పాన్ అవసరం. 
* డిబెంచర్లు, బాండ్లు, ఆర్ బీఐ బాండ్లు కొనుగోలు 50వేల రూపాయల విలువ మించినా పాన్ ఇవ్వాలి. 
* లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఏడాదికి కట్టే ప్రీమియం 50వేల రూపాయలు దాటినా పాన్ తప్పదు. 
* ఈ వివరాలకు సంబంధించిన ఇంగ్లిష్ నోటిఫికేషన్ ను http://pib.nic.in/ లింక్ నుంచి పొందవచ్చు. 
మైనర్లకు పాన్ నంబర్... మంచిదే
మైనర్లకు పాన్ నంబర్ ఎందుకని అనుకుంటున్నారా? కానీ కొన్ని సందర్భాల్లో ఆ అవసరం ఏర్పడవచ్చు. చిన్నారుల పేరుపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆ మొత్తం నిర్ణీత పరిధి దాటితే వారి పేరుతో ఉన్న పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, స్టాక్స్, ఇతర పెట్టుబడులకు నామినీగా మైనర్ పేరును పేర్కొంటే అప్పుడు కూడా మైనర్ పేరుతో ఉన్న పాన్ నంబర్ ఇవ్వాలి. మైనర్ అంటే బాల బాలికలు. సహజంగా వీరికి ఎలాంటి ఆదాయం ఉండదన్నది ప్రభుత్వం భావన. అందుకే మైనర్ల పేరిట వచ్చే ఆదాయాన్ని వారి తల్లిదండ్రుల ( వీరిలో ఆదాయం ఆర్జించేవారు) ఆదాయంగానే పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నారుల పేరు మీద ఏదైనా ఆదాయం వచ్చినట్టయతే దాన్ని తల్లిదండ్రులు తమ ఆదాయంలో భాగంగానే చూపించి పన్ను వర్తించే ఆదాయమైతే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చిన్నారులకు అంగవైకల్యం ఉండి వారు సొంతంగా ఆదాయాన్ని పొందినట్టయితే అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల ఆదాయానికి కలపరు. అలాగే, తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఆదాయం వస్తే దాన్ని సంరక్షకుల ఆదాయానికి కలపరు.  
ఎన్ఆర్ఐలకూ కూడా పాన్ అవసరమే
ఎన్ఆర్ఐలు భారత్ లో పన్ను వర్తించే ఆదాయాన్ని పొందుతుంటే రిటర్నులు దాఖలు చేయాలి. అందుకు పాన్ నంబర్ తప్పనిసరి. అలాగే భారత స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు పాన్ తప్పనిసరి. ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు కూడా పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన ఆర్థిక లావాదేవీల విషయంలోనూ భారతీయులకు వర్తించే నిబంధనలే వారికి కూడా వర్తిస్తాయి.  
పాన్ కార్డుతో జాగ్రత్త... 
పాన్ నంబర్ దుర్వినియోగం కావడానికి అవకాశం ఉంది. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఇచ్చిన పాన్ నంబర్లను కొంత మంది బంగారం వర్తకులు సేకరించి (రిజర్వేషన్ చార్టులలో కనిపిస్తుంది) అధిక విలువ గల బంగారం విక్రయ లావాదేవీలకు వాటిని వినియోగించినట్టు ఒక వినియోగదారుల ఉద్యమ సంస్థ గతంలో బయటపెట్టింది. ఇలా దుర్వినియోగమైన సందర్భాల్లో ఆయా లావాదేవీలకు సంబంధించి ఆదాయ వనరుల వివరాలు సమర్పించాలని ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు.  
పాన్ కార్డును గుర్తింపు పత్రంగా కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. మొబైల్ సిమ్ కార్డుకు కూడా పాన్ కార్డు కాపీ ఇచ్చేవాళ్లున్నారు.  పన్ను చెల్లింపు దారులు తమ పాన్ నంబర్ పేరిట బినామీ లావాదేవీలు జరిగితే ఫామ్ 26ఏఎస్ ద్వారా తెలుసుకునే వీలుంది. మిగిలిన వారికి ఆ అవకాశం లేదు. ఆర్థిక పరమైన మోసాలకు పాల్పడేవారు, బినామీ లావాదేవీలకు ఇతరుల పాన్ కార్డులను దొంగతనంగా వాడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక అనవసరమైన వేదికల్లో అంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి అని నిర్దేశించిన లావాదేవీలకు తప్పితే మరెక్కడా పాన్ నంబర్ ఇవ్వకుండా ఉండడమే శ్రేయస్కరం. 
పాన్ కార్డుపై ఏఏ వివరాలు ఉంటాయి?
ఇంటి పేరుతో సహా కార్డు దారుడి పూర్తి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10 అంకెల పాన్ నంబర్, సంతకం, ఫొటో, జారీ చేసిన తేదీ పాన్ కార్డుపై కనిపిస్తాయి. పాన్ కార్డుపై ఉండే పది అక్షరాలలో ఉదాహరణకు... BJQPP5524G ఈ పాన్ నంబర్ లో మొదటి మూడు ఆల్ఫాబెటిక్ (ఏ నుంచి జెడ్ లోపు) సిరీస్ లోనివి. నాలుగోది పీ అంటే పర్సన్ అని అర్థం. వ్యక్తి కాకుండా కంపెనీ అయితే అక్కడ సీ అని ఉంటుది. అదే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ అయితే హెచ్, సంస్థ అయితే ఎఫ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే ఏ, ట్రస్ట్ అయితే టీ, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ కు బీ, లోకల్ అథారిటీ అయితే ఎల్, ఆర్టిఫీషియల్ జురిడికల్ పర్సన్ అయితే జే, ప్రభుత్వం అయితే జీ అనే అక్షరం ఉంటుంది. ఐదో అక్షరం పీ అనేది కార్డు దారుడి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు కార్డు దారుడి ఇంటి పేరు పచ్చళ్ల అనుకుంటే పీ అని, నారా అయితే ఎన్ అని ఉంటుంది. తర్వాతి నాలుగు ప్రత్యేకమైన నంబర్. చివరి ఆల్ఫాబెటిక్ అక్షరం చెక్ డిజిట్ అని అర్థం. 

కామర్స్ విద్యార్ధులకు ఆదర్శం - భారత మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం... ఇంద్రా నూయీ


చదవండి ...స్పూర్తిని పొందండి ......
‘ఆశయాలేమో గొప్పగా ఉన్నాయి. వాటిని సాధించుకుందామంటే సరిపడేంత వనరులు లేవు మరి. ఏం చేయాలి? ముందు, వెనుకా ఆలోచించకుండా అమెరికా వచ్చేశాను’ అంటూ ఆ విద్యార్థిని మధనపడుతూ ఉండి ఉంటే... ఇంద్రా నూయీ పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంచనాలేసుకుని రావడానికి తానేమైనా, అనుభవజ్ఞురాలు కాదు కదా? ఈ తరహా పరిపరి విధాల యోచనలను పక్కనబెట్టేసిన ఆమె, తొలి ఇంటర్వ్యూ కోసం కొనుక్కోవాల్సిన వెస్టర్న్ సూట్ గురించే ఆలోచిస్తోంది. కనీసం 50 డాలర్లయినా కావాలి మరి. అప్పటికే విద్యాభ్యాసం కోసమే, నడిరాత్రి నుంచి సూర్యోదయం దాకా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. అలా సంపాదించుకున్న దాన్నుంచి, ఎలాగైతేనేం 50 డాలర్లు మిగిల్చింది.
ఇంటర్వ్యూకు వెళ్లే నాటికి అనుకున్నట్లుగానే తొలిసారిగా సూటుతోనే కార్పోరేట్ సంస్థ మెట్లెక్కింది. అయితే నిరాశే ఆమెకు స్వాగతం చెప్పగా ఊసురోమంటూ తిరిగి రాక తప్పలేదు. ఇక అక్కడితో ఆమె వెనుదిరిగి వుంటే కనుక... ఇంద్రా నూయీ ఎవరో కూడా తెలిసేది కాదేమో. ఓ అధ్యాపకుడు ఇచ్చిన బ్రహ్మాండమైన సలహా ఆమె దశనే మార్చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా చరిత్ర పుటలకెక్కింది.
చీరకట్టుతోనే తొలి కొలువు సాధన
తొలి ఇంటర్వ్యూ సందర్భంగా పాశ్చాత్య పోకడలను పరిశీలించిన మీదట, మనం కూడా అలా వెళ్లకపోతే ఇబ్బంది పడతామేమో అన్న మీమాంస నూయీని సంశయంలో పడేసింది. ఆ కారణంగానే శక్తికి మించి పనిచేసి, సూటు కొనుక్కుని ఇంటర్వ్యూ కు  హాజరైంది. ఆ డ్రస్సులో ఇబ్బంది పడుతున్న ఆమె... ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను మెప్పించలేకపోయింది. దీంతో గంపెడాశలు పెట్టుకున్న కొలువు యత్నం బెడిసికొట్టడంతో దిగాలుగా కనిపించిన నూయీని, ఆమె చదువుతున్న కళాశాలలోని ఓ ప్రొఫెసర్ విషయమేమిటని ఆరా తీశారు.
 ఏ వస్త్రధారణ అయితే నీకు సౌకర్యంగా ఉంటుందన్న ఆయన ప్రశ్నకు చీరేనంటూ తన సంప్రదాయ వస్త్రధారణను వివరించారు. అయితే చీరలోనే వెళ్లమంటూ ఆయన ఇచ్చిన సలహాను పాటించిన నూయీ... రెండో యత్నంలో ఉద్యోగం సాధించారు. అలా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో 1980లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా, నిండైన చీరకట్టునే ఆశ్రయించారు. అంతేకాదండోయ్... పెప్సీకో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్న నూయీ, బోర్డు మీటింగ్ లకు ఇప్పటికీ చీరలోనే వెళతారట!
తల్లి ప్రేరణతోనే ఉన్నతాశయాల దిశగా...!
చెన్నైకి చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయీ... 1955 అక్టోబర్ 28న జన్మించింది.  సోదరితో కలిసి పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆమె తల్లి ప్రేరణతో కొత్త విషయాల వైపు దృష్టి సారించారు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండే ఇద్దరు పిల్లలకు నిత్యం కొత్త అంశాల గురించి ఆ మాతృమూర్తి చెప్పేవారట. ఈ క్రమంలోనే నూయీ మదిలో సరికొత్త అంశాలపైకి దృష్టి మళ్లింది. అంతేకాక, ఇతరుల కంటే ఉన్నతంగా రాణించాలనే ధ్యాస కూడా తల్లి బోధనల నుంచే అబ్బిందని తల్లిని గుర్తు చేసుకుంటూ మురిపెంగా చెబుతారు ఇంద్రా నూయీ.
ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే... అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా తొలుత తల్లితోనే మాట్లాడతానని కూడా ఆమె గర్వంగా చెబుతారు. తల్లి చెప్పిన మార్గాన్ని ఆశ్రయించి సమస్య నుంచి ఉమశమనం పొందుతారు. తన తల్లిలానే నూయీ కూడా ఇద్దరు కుమార్తెలకు తల్లి. ఓ వైపు ప్రపంచంలోనే పేరెన్నికగన్న కంపెనీ బాధ్యతలు మోస్తున్నప్పటికీ, తన తల్లిలానే పిల్లలకు అందుబాటులోనే ఉంటూ, ఉన్నతాశయాల గురించి నూరిపోస్తూనే ఉంటారు.
చదువులోనూ దిట్టే!
విద్యాభ్యాసం విషయానికి వస్తే, ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చెన్నైలోనే చదువుకున్న నూయీ, మేనేజ్ మెంట్ చదువు కోసం కోల్ కతా వెళ్లారు. అక్కడి ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించిన నూయీ, ఆపై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే తాను చదవాలనుకున్న సంస్థలో విద్యనభ్యసించేందుకు మాత్రం ఆమెకు ఆర్థిక పరిస్థితులు కలసిరాలేదు. అయినా రాజీపడని నూయీ, ఖాళీ సమయాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని కనెక్టికట్ లోని యాలే వర్సిటీలో విద్యనభ్యసించారు. ఇందుకోసం రాత్రి పొద్దుపోయిన తర్వాత నుంచి తెల్లవారేదాకా రిసెప్షనిస్టుగా పనిచేశారు. చదువులో చురుకుగా ఉన్న నూయీ అంటే అక్కడి అధ్యాపకులకు ఎంతో ఇష్టం. అందుకే ఆమె ఎప్పుడైనా దిగాలుగా కనిపిస్తే చాలు, విషయం ఏంటని ఆరా తీసేవారు.
ఏబీబీ... దశ మార్చేసింది
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో పనిచేసిన కొంతకాలానికి మరింత పెద్ద కంపెనీలో ఉద్యెోగం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఏసియా బ్రౌన్ బొవేరీ  (ఏబీబీ) నూయీకి రెడ్ కార్పెట్ పరిచింది. నాలుగేళ్లుగా వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తించిన ఆమె అక్కడి ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్లో ఒకరిగా సత్తా చాటారు. కార్పోరేట్ వ్యవహారాలు, ప్రణాళిక విభాగానికి అధిపతిగా పనిచేసిన నూయీ, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లారు. తద్వారా కంపెనీ పురోగతిపై తన ప్రత్యేక ముద్ర వేశారు. దీంతో వ్యాపార వర్గాల్లో తన పేరు ప్రస్తావన చర్చకొచ్చే స్థాయికి  ఆమె చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఆమెకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఇలా ఆమెకు రెడ్ కార్పెట్ పరిచిన కంపెనీల్లో ప్రపంచ విఖ్యాత కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (GE) కూడా ఉంది. అయితే ఆ కంపెనీలో చేరి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో మరి!
నూయీ అవసరం పెప్సీకి ఉందట!
జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిన సమయంలో దాదాపుగా ఆ కంపెనీలో చేరిపోయేందుకు నూయీ సిద్ధమైపోయారు. అప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ పేరుతో పాటు దాని యజమాని జాక్ వెల్చ్ కు విఖ్యాత పారిశ్రామిక వేత్తగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఆఫర్ ను తిరస్కరించే వారే ఉండరు. కానీ, నూయీ మాత్రం తిరస్కరించారు. కాదు, పెప్సీకో ఛైర్మన్... నూయీ చేత తిరస్కరింపజేశారు. ‘జనరల్ ఎలక్ట్రిక్ మంచి కంపెనీనే. దాని యజమాని అత్యుత్తమ సారధి. అందులో సందేహం అవసరం లేదు. అయితే మీలాంటి వ్యక్తులు పెప్సీకోకు కావాలి. అంతేకాక పెప్సీకోను మీకు మరింత ప్రత్యేకంగా మారుస్తాను’ అంటూ పెప్సీకో చీఫ్ చెప్పిన మాటలకు నూయీ కాదనలేకపోయారు. వెనువెంటనే పెప్సీకో కార్పోరేట్ వ్యవహరాలు, ప్రణాళిక విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా 1994లో విధుల్లో చేరిపోయారు. ఆ తర్వాత పెప్సీకో తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ నూయీ కీలక భూమిక పోషించారు. సంస్థను పోటీదారులకు సవాల్ చేసే విసిరే స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు.
పోటీ లేకుంటే మజా ఏముంది?
నిత్యం కార్పొరేట్ వ్యవహారాల్లో మునిగిపోయే నూయీని కదిలిస్తే... కార్పోరేట్ల పోటీతత్వంపై గంటల తరబడి మాట్లాడతారు. అసలు సరైన పోటీ లేకుంటే మజా ఏముంటుందంటూ ఎదురు ప్రశ్నిస్తారు. కోకకోలా లాంటి ఉద్ధండ సంస్థలుండబట్టే కదా పెప్సీ ఈ స్థాయికి ఎదిగింది అంటూ ఆశ్చర్యపరుస్తారు. పెప్సీకోలో చేరే నాటికి 44 ఏళ్ల వయసున్న నూయీ... సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. సంస్థ వేసిన ప్రతి అడుగులోనూ తన ప్రమేయాన్ని చాటుకున్న ఆమె పనితీరు కంపెనీకి అయాచిత లాభాలను సాధించిపెట్టింది.
సంస్థకు అనుబంధంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ చైన్ ను పూర్తిగా విలీనం చేసుకోవడం వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ట్రోపికానాతో పాటు క్వాకర్ ఓట్స్ ను చేజిక్కించుకునే క్రమంలోనూ నూయీ వాదనకు పెప్సీ విలువిచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు పెప్సీకి మరింత ఊపునిచ్చాయి. దీంతో కంపెనీలో ఆమెకు మరింత ప్రాధాన్యం పెరిగింది. దీంతో వైస్ ప్రెసిడెంట్ హోదా నుంచి సీఎఫ్ఓగా పదోన్నతి పొందడంతో పాటు 2001లో కంపెనీ డైరెక్టర్ల బోర్డులోనూ స్థానం సంపాదించారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్ గానూ పెప్సీకోలో అత్యున్నత స్థానానికి ఎగబాకారు.
ఎల్లవేళలా తిరుమల వెంకన్న నామస్మరణ
చూడటానికి ఆధునిక యువతిలా కనిపించినా... స్వదేశాన్ని వదిలి పాశ్చాత్య దేశంలో స్థిరపడ్డా ఇంద్రా నూయీ... నేటికీ భక్తిభావం నుంచి అంగుళం కూడా దూరం జరగలేదు. అంతేకాదు, మరింత దగ్గరైందనే చెప్పాలి. నిత్యం తిరుమల వెంకటేశ్వర స్వామిని తలచుకుంటూనే కార్యరంగంలో దూసుకెళుతూ ఉంటారట. పని ఒత్తిడిలో అలసిపోతే...  ఒక్కసారి వెంకన్నను తలచుకుంటే ఇట్టే రీచార్జీ అయిపోతానని నూయీ చెబుతూ ఉంటారు. అంతేకాక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంటే, చెన్నైలోని తల్లికి ఫోన్ చేసినా, ‘వెంకన్నను స్మరించుకో తల్లి, అంతా బాగుంటుందనే’ సమాధానమే వస్తుందని చెబుతుంటారు. ఇక ఇంటిలో రోజుకు 18 గంటల పాటు కర్ణాటక సంగీతం మారుమోగుతూనే ఉండాలట. కర్ణాటక సంగీతం వింటూ ఉంటే, దేవాలయంలోనే ఉన్నట్లుంటుంది అని నూయీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
కుటుంబ సభ్యులతో సమానంగా సిబ్బంది
అటు కుటుంబం, ఇటు కార్యాలయం రెండింటినీ సమానంగానే చూస్తానంటూ చెప్పే నూయి... రెండింటిలో దేనికి ప్రాధాన్యమిస్తారంటే మాత్రం కుటుంబమనే చెబుతారు. అయితే కార్యాలయంలోని సిబ్బందిని కూడా కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానంటూ తెలివిగా మాట్లాడేస్తారు. అసలు ప్రావీణ్యం లేని సిబ్బందితో కంపెనీలు ఎలా ఎదుగుతాయి? అని ప్రశ్నించే నూయీ... తన కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అంశంలో అత్యంత విలువైన సామర్ధ్యం ఉందని భావిస్తారు. చివరకు రిసెప్షనిస్టును కూడా ఇంటికి ఆహ్వానిస్తారు. తన పిల్లల దినచర్య ఏమిటనే విషయం కార్యాలయంలోని ప్రతి ఒక్కరికీ తెలుసట మరి. అందుకే నూయీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

న్యాయవ్యవస్థ నిర్మాణం... దిగువ కోర్టు నుంచి సుప్రీమ్ కోర్టు వరకు..!


న్యాయవ్యవస్థ నిర్మాణం... దిగువ కోర్టు నుంచి సుప్రీమ్ కోర్టు వరకు.


శాసన వ్యవస్థ... కార్య నిర్వాహక వ్యవస్థ... న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా ప్రభుత్వంలో భాగమే. ఈ మూడూ దేశానికి మూల స్తంభాల్లాంటివి. ముఖ్యంగా న్యాయవ్యవస్థ విషయానికొస్తే... పౌరుల హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడంతోపాటు, రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా ఆయా వివాదాలను పరిష్కరించి, న్యాయాన్ని అందించడమే కోర్టుల విధి. విచారణ, తీర్పుల్లో నిష్పాక్షికత ఉన్నప్పుడే న్యాయం సాధ్యమవుతుందని తెలుసు కదా. అందుకే న్యాయ వ్యవస్థ మిగతా రెండు వ్యవస్థలకు భిన్నంగా, స్వతంత్రంగా పనిచేస్తుంటుంది. 
కోర్టుల నిర్మాణాన్ని పరిశీలిస్తే... 
దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశంలో ఉన్న అన్ని కోర్టులకు ఇదే సుప్రీమ్. తర్వాత రాష్ట్రాల స్థాయిలో హైకోర్టు ఉన్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది. తర్వాత జిల్లా కోర్టులు, వాటి కింద మున్సిఫ్ కోర్టులు పని చేస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామ న్యాయాలయాలు కూడా ఉన్నాయి.  
సుప్రీంకోర్టు 
భారత్ ను సమాఖ్య దేశంగా చెబుతారు. అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా వ్యవహరిస్తుంది. దిగువ కోర్టుల తీర్పులపై అప్పీల్ రూపంలోనే కాదు... ఆర్టికల్ 131 ప్రకారం అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాల కేసులను నేరుగా విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. తనకున్న అధికారాల మేరకు కోర్టు ధిక్కారం కింద ఎవరినైనా శిక్షించగలదు. సుప్రీంకోర్టుకు న్యాయసమీక్షాధికారం కూడా ఉంది. అంటే పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు రూపొందించిన చట్టాలు పౌరుల హక్కులకు భంగకరం అనుకుంటే వాటిని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగలదు. ఈ మేరకు రాజ్యాంగం సుప్రీంకోర్టుకు విశేష అధికారాలను కట్టబెట్టింది. 
సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు. అలాగే మరో 30 మంది న్యాయమూర్తులు కూడా ఉంటారు. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా సుప్రీంకోర్టుపై ఉంది. సుప్రీంకోర్టులో వివిధ డివిజన్ బెంచ్ లు ఉంటాయి. వీటినే ధర్మాసనం అని అంటుంటాం. ఇవి ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులతో ఉంటాయి. ఫుల్ బెంచ్ లో ముగ్గురి నుంచి ఐదుగురు వరకు న్యాయమూర్తులు కొలువుదీరి కేసుల విచారణ చేపడతారు. అతిపెద్ద బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం. అందులో ఐదు నుంచి ఏడుగురు జడ్జిలు ఉంటారు. రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి వివాదాలు ఏర్పడితే ఈ ధర్మాసనమే పరిష్కరిస్తుంది. అలాగే సింగిల్ జడ్జి బెంచ్ లు కూడా ఉంటాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవచ్చు. 65 ఏళ్ల వయసు వరకు న్యాయమూర్తులు తమ పదవుల్లో కొనసాగవచ్చు. న్యాయమూర్తుల దుష్ప్రవర్తన, అశక్తత తదితర కొన్ని ప్రత్యేక అంశాల ఆధారంగా పార్లమెంటు అభిశంసన (ఇంపీచ్ మెంట్) ద్వారా రాష్ట్రపతి సదరు న్యాయమూర్తిని తొలగించవచ్చు. 
అప్పీలేట్ జ్యురిస్ డిక్షన్
హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుల్లో అప్పీల్ కు వెళ్లవచ్చు. సంబంధింత కేసు రాజ్యాంగంలోని అంశాలతో ముడిపడి ఉంటే, చట్టానికి సంబంధించి ఎన్నో సందేహాలతో ముడిపడి ఉందంటూ హైకోర్టులు పేర్కొంటే ఆ కేసుల విచారణను సుప్రీంకోర్టులు అప్పీల్ కు స్వీకరించవచ్చు. సివిల్ కేసులకు సంబంధించి ఒక కేసు ప్రజా ప్రయోజనాల కోణంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందంటూ హైకోర్టు నిర్ధారిస్తే సుప్రీంకోర్టు ముందు అప్పీల్ కు వెళ్లవచ్చు. క్రిమినల్ కేసుల్లో హైకోర్టులు దిగువ కోర్టులు ఇచ్చిన నిర్దోషిత్వపు తీర్పును రిజర్వ్ లో ఉంచి దోషిగా ప్రకటిస్తే దానిపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లవచ్చు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. 
రిట్ జ్యురిస్ డిక్షన్
ఫ్రాథమిక హక్కులకు విఘాతం కలిగినట్టు భావిస్తే వ్యక్తి లేదా సంస్థ నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పౌరుల హక్కులు, స్వేచ్ఛ పరిరక్షణ కోసం రిట్ (ఉత్తర్వు) జారీ చేయవచ్చు. 
అడ్వైజరీ జ్యురిస్ డిక్షన్
రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రజా అవసరాలు, ప్రాధాన్యం దృష్ట్యా ఏదైనీ ఒక విషయాన్ని భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు నివేదించవచ్చు. సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అప్పుడు దానిపై సుప్రీంకోర్టు రాష్ట్రపతికి తమ సలహానందిస్తుంది. దీన్ని అడ్వైజరీ జ్యురిస్ డిక్షన్ అంటారు. అలాగే, దేశంలోని ఏ కోర్టు తీర్పుపైనైనా అప్పీల్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి జారీ చేయగలదు. 
హైకోర్టు
వాస్తవానికి హైకోర్టు అధికారాలు, నిర్వహణకు సంబంధించి రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వలేదు. కేవలం సుప్రీంకోర్టు అధికారాలు, నిర్వహణ విషయంలోనే స్పష్టత ఉంది. అయితే, రాజ్యాంగం అమల్లోకి రాకముందున్నట్టే హైకోర్టు అధికార పరిధి ఉంటుందని రాజ్యాంగంలో పేర్కొన్నారు. దీని ప్రకారం హైకోర్టు అధికారాలు, నిర్వహణ ఇలా వుంటాయి. 
 హైకోర్టులోనూ చీఫ్ జస్టిస్ (ప్రధాన న్యాయమూర్తి) ఒకరు ఉంటారు. నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులపై అప్పీలుగా వచ్చేవే ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తుంటారు. ఆ రాష్ట్రంలోని అన్ని రకాల కోర్టులు, ట్రైబ్యునళ్లు కూడా హైకోర్టు అధికార పరిధిలోకే వస్తాయి. మిలటరీ కోర్టులు, మిలటరీ ట్రైబ్యునళ్లకు మాత్రం మినహాయింపు ఉంది. డిస్ట్రిక్ట్ జడ్జిల పోస్టింగ్ విషయంలో గవర్నర్ కు సలహా ఇస్తుంది. 
సివిల్, క్రిమినల్ కేసుల అప్పీళ్లపై విచారించే అధికారం హైకోర్టుకు ఉంది. సివిల్ కేసుల్లో డిస్ట్రిక్ట్ జడ్జి, సబార్డినేట్ జడ్జిలు ఇచ్చిన తీర్పులపై అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, క్రిమినల్ కేసుల్లో సెషన్స్ కోర్టులు ఇచ్చిన తీర్పులపై అప్పీల్ కు వెళ్లవచ్చు. ఇదెలా అంటే... సెషన్స్ జడ్జి లేదా అడిషినల్ సెషన్స్ జడ్జి ఏడేళ్లకు మించి జైలు శిక్ష విధించినప్పుడు హైకోర్టులో సవాల్ చేయవచ్చు. అలాగే, చిన్న కేసులు కాకుండా ప్రత్యేకమైన కేసుల్లో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పులపై సైతం అప్పీళ్లు దాఖలు చేసుకోవచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయవచ్చు. అలాగే, సబార్డినేట్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు రాజ్యాంగ అంశాలతో ముడిపడినదని హైకోర్టు భావిస్తే ఆ కేసు విచారణను తాను స్వయంగా చేపట్టి తీర్పు ఇవ్వగలదు. అప్పీలేట్ జ్యురిస్ డిక్షన్ కింద సేల్స్ ట్యాక్స్, ఇన్ కమ్ ట్యాక్స్, కాపీ రైట్, పేటెంట్ రైట్ తదితర కేసులపై డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు లేదా సెషన్స్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తాయి. 
ప్రాథమిక హక్కులు, ఇతర కీలకమైన అంశాల్లో హైకోర్టులు ప్రత్యేక ఆదేశాలను (రిట్) జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు, అలాగే ఆర్టికల్ 226 ప్రకారం ఇతర హక్కులకు నష్టం కలిగిన సందర్భాల్లోనూ ఎవరైనా సరే నేరుగా హైకోర్టుల్లో రిట్ పిటషన్ దాఖలు చేయవచ్చు. అన్ని సబార్డినేట్ కోర్టులను హైకోర్టు పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేస్తుంటాయి.  రాజ్యాంగ పరమైన అంశాలపై వివాదం ఉంటే జోక్యం చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను సమీక్షించే అధికారం, ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చెల్లుబాటు కాదని ప్రకటించే అధికారం కూడా ఉంది. దేశంలో 24 హైకోర్టులు ఉన్నాయి. కొన్నిచోట్ల రెండు రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తులు 49 మంది వరకు ఉన్నారు. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 95 మంది ఉన్నారు. ఇలా కోర్టును బట్టి న్యాయమూర్తుల సంఖ్య వేర్వేరుగా ఉంది. 
జిల్లా స్థాయిలో కోర్టులు
జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఉన్నత న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలో అన్ని దిగువ కోర్టులపై అప్పీలేట్ కోర్టుగా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వ్యవహరిస్తుంది. సివిల్ కేసులకు గాను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు వరుసగా ఉంటాయి. క్రిమినల్ కేసుల విచారణకు గాను సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి. కుటుంబ వివాదాల పరిష్కారానికి గాను ఫ్యామిలీ కోర్టులు ఉంటాయి. ఫ్యామిలీ కోర్టులోఉండే ప్రిన్సిపల్ జడ్జి జిల్లా జడ్జి హోదాను కలిగి ఉంటారు.
ముందుగా ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విచారణ ప్రారంభం అవుతుంది. ఈ కేసులో సంబంధిత కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయసమ్మతంగా అనిపించకపోతే ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులను నేరుగా దాఖలు చేయవచ్చు. సివిల్ కేసులను విచారించే సమయంలో డిస్ట్రిక్ట్ జడ్జి అని, క్రిమినల్ కేసులను విచారించే సమయంలో అదే జడ్జిని సెషన్స్ జడ్జి అని అంటారు. అందుకే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అని పిలుస్తుంటారు. మెట్రో సిటీ ( పది లక్షల మంది జనాభా దాటిన ప్రాంతం) పరిధిలో డిస్ట్రిక్ట్ జడ్జిని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పేర్కొంటారు. ఈ కోర్టు పరిధిలో ఉండే దిగువ కోర్టులకు కూడా ముందు మెట్రోపాలిటన్ అనే పదం ఉంటుంది. 
గ్రామ న్యాయాలయాలు
వీటినే లోక్ అదాలత్ లేదా న్యాయపంచాయతీలు అని కూడా అంటారు. వివాదాల కోసం కోర్టుల వరకూ రాకుండా స్థానికంగానే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపేందుకు వీటిని అమల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఐదువేల మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని తలంచగా... కేవలం 151 మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. 
ఫాస్ట్ ట్రాక్ కోర్టు
న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని తిరస్కరించినట్టేనని ఓ నానుడి. సకాలంలో తీర్పు వస్తేనే న్యాయం దక్కినట్టు అని దీనర్థం. కానీ, దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అన్ని కోర్టులలో కలిపి 3 కోట్ల కేసుల వరకు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో మూడింట రెండొంతుల కేసులు మూడేళ్లుకుపైగా విచారణల దశలోనే ఉన్నాయి. అందుకే కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని 11వ ఆర్థిక సంఘం సూచించింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను చేపట్టేందుకు 1734 కోర్టులను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రతి కోర్టు నెలకు 40 కేసుల వరకు పూర్తి చేసేలా విధానాన్ని రూపొందించారు.  
అయితే, వీటిలో 1562 కోర్టులు మాత్రమే ఏర్పాటయ్యాయి. 2011 మార్చి వరకు కేంద్రమే వీటి నిర్వహణ వ్యయాన్ని భరించింది. తర్వాత రాష్ట్రాలకు వదిలిపెట్టింది. దీంతో రాష్ట్రాలు ఆ భారాన్ని భరించడం ఇష్టలేక వాటిని వదిలించుకునేందుకు మొగ్గు చూపాయి. ప్రస్తుతం 473 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయని ఒక అంచనా. 
స్పెషల్ కోర్టులు
పేరులో ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ఓ విభాగానికి సంబంధించిన కేసుల విచారణకు గాను వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు... చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసి దోషులకు శిక్ష పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 654 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. భారీ కుంభకోణమైన 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణకు కూడా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే, మహిళలపై వేధింపుల కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా 14 స్పెషల్ కోర్టులను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక కార్పొరేట్ కంపెనీల మోసాలకు సంబంధించిన కేసుల విచారణకుగాను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసుల సత్వర విచారణకు గాను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంటాయి. 
ఇవే కాకుండా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు, సామరస్యపూర్వకంగా ఇరు పార్టీలు రాజీకొచ్చేలా లోక్ అదాలత్ కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తుంటారు. 
ట్రైబ్యునళ్లు
ట్రైబ్యునళ్లు కోర్టుల్లాంటివే గానీ కోర్టులు కావు. ప్రత్యేకంగా వివిధ రంగాల కోసం ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో ఆయా రంగాలకు సంబంధించి న్యాయ నిపుణులైన వారు సభ్యులుగా ఉంటారు. దీంతో వాస్తవాల ఆధారంగా వివాదాలకు సంబంధించిన కేసులను విచారించి ఆదేశాలు ఇస్తుంటారు. కోర్టుల్లో కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో వివిధ రంగాల్లో ముఖ్యమైన కేసులను సత్వరం విచారించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. 
జాతీయ హరిత ట్రైబ్యునల్, డెట్ రికవరీ ట్రైబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఆర్మ్ డ్ ఫోర్స్ ట్రైబ్యునల్, ఈపీఎఫ్ అప్పీలేట్ ట్రైబ్యునల్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్పీలేట్ బోర్డ్, సైబర్ అప్పీలేట్ ట్రైబ్యునల్, మోటారు యాసిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్... ఇలా ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 323ఏ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ కు ఉద్దేశించినది కాగా, 323బీ ఇతర వ్యవహారాల కోసం ఉద్దేశించనది. ఆర్టికల్ 323బీ పార్లమెంటు, అసెంబ్లీలకు ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని కట్టబెట్టింది. దీని కింద పన్నుల చట్టాలు, ఫారీన్ ఎక్స్చేంజ్, ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు, పరిశ్రమలు, కార్మికుల వివాదాలు, భూ సంస్కరణలు ఇలా పలు రకాల అంశాలకు సంబంధించి ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 
డెట్ రికవరీ ట్రైబ్యునల్ విధులను చూస్తే... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు బకాయి ఉన్న రుణాలను రాబట్టుకునేందుకు వీలుగా ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తాయి. వీటిని ఏర్పాటు చేయకముందు వివిధ కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఏళ్ల తరబడి తీర్పు కోసం వేచి చూడాల్సి వచ్చేది. ట్రైబ్యునల్ వల్ల కాలయాపన లేకుండా రుణాలను రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, పర్యావరణ సంబంధిత అంశాలపై గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించినట్టయితే, నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధింపు, పరిహారం చెల్లింపు, పర్యావరణానికి విఘాతం కలిగించే కట్టడాలు, నిర్మాణాల నిలిపివేతకు ఆదేశాలు పొందవచ్చు.  
ఉద్యోగికి, ప్రభుత్వానికి మధ్య వివాదాలు నెలకొంటే వాటిని అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగుల సర్వీసు అంశాలపై వివాదం నెలకొంటే న్యాయం కోసం ఉద్యోగి ట్రైబ్యునల్ కు ఆశ్రయించవచ్చు. కేసును విచారించిన తర్వాత ట్రైబ్యునళ్లు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తుంటాయి. వీటిని ప్రభుత్వం అమలు చేయాలి. ట్రైబ్యునళ్లు ఇచ్చే ఆదేశాలపై అప్పీలేట్ అథారిటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అప్పీల్ కు వెళ్లవచ్చు. ట్రైబ్యునళ్లు విచారణలో భాగంగా సమన్లు జారీ చేయడంతోపాటు ఎవరినైనా తమ ముందు హాజరుపరచాలని ఆదేశించవచ్చు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించవచ్చు. డాక్యుమెంట్లను సమర్పించాలని కోరవచ్చు. మధ్యంతర ఆదేశాలను సైతం ఇస్తాయి. 
ఫ్యామిలీ కోర్టు
వివాహం, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను సత్వరం పూర్తి చేసేందుకు వీలుగా ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటయ్యాయి. జిల్లా జడ్జి హోదా కలిగిన వారే ఫ్యామిలీ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తారు. విడాకుల మంజూరు, చిన్నారుల సంరక్షణ, భరణం, భృతి కోసం వీటిని ఆశ్రయించవచ్చు. ఫ్యామిలీ కోర్టులు ఇచ్చిన తీర్పులపై హైకోర్టును ఆశ్రయించవచ్చు.   
కన్జ్యూమర్ ఫోరం 
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారు. కస్టమర్ తాను కొన్న ఉత్పత్తి, లేదా సేవ నాసిరకమనిపించినా, లేదా అర్ధంతరంగా పాడైపోయినా కంపెనీలపై న్యాయ పోరాటం చేసేందుకు వీటిని ఆశ్రయించవచ్చు. ఒక్కోసారి ఉత్పత్తి విలువ చాలా తక్కువే ఉండవచ్చు. కానీ వాటి విషయంలో కంపెనీలపై న్యాయపోరాటానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే తక్కువ వ్యాయానికే వేగంగా న్యాయం అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక కన్జూమర్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఫోరానికి అధ్యక్షుడిగా న్యాయమూర్తి ఉంటారు. పలువురు సభ్యులు కూడా ఉంటారు. 
టాడా కోర్టు
టాడా కోర్టు కేవలం టాడా చట్టం కింద నమోదైన కేసుల విచారణ కోసమే ఏర్పాటు చేయబడినది. ప్రస్తుతం టాడా చట్టం అమల్లో లేదు. ఉగ్రవాద, విధ్వంసక చర్యల నిరోధక చట్టాన్ని సంక్షిప్తంగా టాడా అని పేర్కొంటారు. దేశంలో ఉగ్రవాద చర్యల నిరోధానికి తీసుకొచ్చిన తొలి చట్టం ఇదే. 1985 నుంచి 1995 వరకు అమల్లో ఉంది. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని పెద్ద ఎత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 1995లో దీన్ని రద్దు చేశారు. ఉగ్రవాద, సమాజ విధ్వంసక కార్యకలాపాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే సంస్థలకు ఈ చట్టం అసాధారణ అధికారాలను కట్టబెట్టింది. ఎలా అంటే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన పని లేదు. అలాగే, ఏడాది పాటు నిర్బంధించే అధికారం కూడా ఉంది. 
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు విచారణను టాడా కోర్టే చేపట్టింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా తొలుత టాడా చట్టం కిందే విచారణను ఎదుర్కొన్నారు. అయితే, ఈ చట్టం కింద మోపిన అభియోగాలు ఏవీ నిరూపణ కాకపోవడంతో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆయుధాల చట్టం కింద కోర్టు శిక్ష విధించింది. ముంబైకి చెందిన ఓ బిల్డర్ హత్య కేసులో అబూసలేమ్ కు కూడా టాడా కోర్టే దోషిగా ప్రకటించి శిక్ష విధించింది. అలాగే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును కూడా టాడా కోర్టే విచారించింది. ఈ కోర్టులలో విచారణ ఇన్ కెమెరా (రహస్య విచారణ) పద్ధతిలో  జరుగుతుంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేవలం సుప్రీంకోర్టులోనే అప్పీలుకు అవకాశం ఉంటుంది. 
ఈ చట్టం కింద 76వేల మందికి పైగా అరెస్ట్ కాగా అందులో 25 శాతం మందిపై ఎటువంటి అభియోగాలు లేవంటూ దర్యాప్తు సంస్థలే కేసులను ఉపసంహరించుకున్నాయి. నమోదైన కేసుల్లో కేవలం 35 శాతం మాత్రమే విచారణ దశకు రాగా, అందులో 95 శాతం నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. కేవలం 2 శాతం లోపే దోషులుగా తేలారు. అయితే, టాడా చట్టం అమల్లో ఉన్న కాలంలో నమోదైన కేసుల విచారణకు గాను టాడా కోర్టు ముంబైలో ఇప్పటికీ కొనసాగుతోంది. 
సీబీఐ కోర్టు
సీబీఐ అన్నది దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఈ సంస్థ చేపట్టిన కేసుల విచారణకు గాను ప్రతీ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా సీబీఐ కోర్టులు ఏర్పడ్డాయి. సాధారణ కోర్టులపై కేసుల భారం పెరిగిపోవడంతో సీబీఐ కేసుల విచారణ భారం కూడా వాటిపైనే మోపకుండా ఉండేందుకు సీబీఐ కోర్టులను ఏర్పాటు చేశారు. ఇవి ఇచ్చే తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మాత్రమే అప్పీల్ కు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులను కూడా సీబీఐ సంస్థే దర్యాప్తు చేస్తుంటుంది.
ఏసీబీ కోర్టు
అవినీతి వ్యవహారాల నిరోధానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైందే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఆయా కేసుల విచారణను ఏసీబీ చూస్తుంటుంది. ఈ కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేందుకు, మిగిలిన కోర్టులపై పనిభారం తగ్గించేందుకు వీలుగా ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేశారు.

బ్యాంకు లావాదేవీలు భద్రంగా ఉండాలంటే - జాగ్రత్తలు


నేటి జీవనంలో బ్యాంకు లావాదేవీలు ఓ భాగమైపోయాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వినియోగం విస్తృతం కావడంతో నేరగాళ్లు వీటిని లక్ష్యం చేసుకుంటున్నారు. ప్రతి లావాదేవీ భద్రంగా ఉండాలంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
సీవీవీ చేరిపేయండి
అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులపై వెనుక భాగంలో మూడక్షరాల నంబర్ ఉంటుంది. దీన్నే సీవీవీ అంటారు. బ్యాక్ గ్రౌండ్ తెల్లటి రంగుపై ఈ నంబర్ ఉంటుంది. కార్డు అందుకున్న వెంటనే ఈ సీవీవీ నంబర్ ను ఒకటికి నాలుగు సార్లు స్మరణ చేసి గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లో ఓ చోట రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కార్డుపై ఉన్న సీవీవీ నంబర్ ను చెరిపేయాలి. మనలో చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఈ సీవీవీ నంబర్ ను కార్డుపై అలానే వదిలేయడం. ఈ సీవీవీ నంబర్, కార్డు ముందు భాగంలో ఉండే నంబర్, ఎక్స్ పయిరీ డేట్, పాస్ వర్డ్ వివరాలు నేరగాళ్ల కంట్లో పడడం ఆలస్యం... అచ్చం అలాంటి వివరాలతోనే డూప్లికేట్ కార్డు పుడుతుంది. మీ కార్డులో ఉన్న నగదు అంతా ఖాళీ అయిపోతుంది. అందుకే తప్పనిసరిగా సీవీవీ చెరిపేయాలి. ఒకవేళ సీవీవీ చెరిపేసిన తర్వాత నంబర్ ను మర్చిపోతే మళ్లీ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మినహా మరో మార్గం లేదు.
పాస్ వర్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో పాస్ వర్డ్ చాలా సున్నితమైనది. తేలిగ్గా గుర్తుండడం కోసం పుట్టినతేదీ, పేరును పాస్ వర్డ్ గా పెట్టుకోవడం చేస్తుంటారు కొందరు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లు సులువుగా పసిగట్టేస్తారు. అందుకే ఊహించడానికి కూడా సాధ్యం కాని రీతిలో పాస్ వర్డ్ ఉండాలి. కేపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్లు, స్టార్, హ్యాష్ వంటి ప్రత్యేక క్యారక్టర్లు కలగలిపి పాస్ వర్డ్ ఉండాలి. పాస్ వర్డ్ కూడా పెద్దగా ఎక్కువ అక్షరాలతో ఉండాలి. చిన్నదయితే మీరు టైప్ చేస్తున్న సమయంలో తెలివైన వారు సులువుగా గమనించగలరు.
పాస్ వర్డ్ లు ఎక్కడ దాచిపెడుతున్నారు..?
పాస్ వర్డ్ మర్చిపోతామేమో అన్న భయంతో కొంత మంది మొబైల్ లో, ఈ మెయిల్ లో సేవ్ చేసి ఉంచుకుంటారు. కానీ, మొబైల్ పోతే... లేదా మరెవరి చేతిలోనయినా పడితే, మెయిల్ ను సైబర్ నేరగాళ్లు తెరిస్తే ఏమవుతుందో ఆలోచించండి. అందుకే ఒకవేళ మొబైల్, మెయిల్ లో సేవ్ చేసి ఉంచినప్పటికీ అందరికీ అర్థమయ్యేలా సింపుల్ ఇంగ్లిష్ లో అది ఉండకూడదు. కేవలం మీకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసి పెట్టుకోవాలి. లేదా మొదటి చివరి అక్షరం రాసి పెట్టుకున్నా కొంత వరకు భద్రమే.
టెలిఫోన్, ఈ మెయిల్ లో షేర్ చేసుకోవద్దు
మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కారు. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేసి మన కార్డు సమాచారం, పాస్ వర్డ్ అడిగి తెలివిగా టోపీ పెడుతున్నారు. ఓటీపీ ఉంటే భద్రం అని అనుకుంటారు. కానీ, కాల్ చేసే జాదూగాళ్లు ఓటీపీ చెబితే కార్డు లిమిట్ పెంచుతామని అమాయకులను మోసం చేయడం ఇటీవలి కాలంలో జరుగుతోంది. కానీ ఏ బ్యాంకు కూడా కస్టమర్లకు కాల్ చేసి పాస్ వర్డ్, సీవీవీ వంటి సున్నిత సమాచారాన్ని అడగదు. అందుకే ఎవరైనా కాల్ చేసి ఈ సున్నిత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు.  
బ్రౌజర్ లో సేవ్ చేయవద్దు
కొన్ని సైట్లలో లాగిన్ డిటైల్స్ ఇవ్వగానే పాస్ వర్డ్ ను సేవ్ చేయమంటారా? అని అడుగుతుంటాయి. కొందరు ఓకే అని క్లిక్ చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మరోసారి లాగిన్ సమయంలో ఈ వివరాలన్నీ ఇవ్వక్కర్లేదు. అవన్నీ బ్రౌజర్ లో సేవ్ అయ్యి ఉంటాయి. అంటే అవి నేరగాళ్ల చేతుల్లో పడడానికి సిద్ధంగా ఉన్నట్టే. . 
లావాదేవీ ఏదైనా ఎస్ఎంఎస్ రావాల్సిందే
అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వచ్చే సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. మోసం జరిగిన వెంటనే సమాచారం అందుతుంది. నేరగాళ్లు విడతల వారీగా నగదును తరలించుకుపోతారు కనుక మొదటి లావాదేవీతోనే అడ్డుకోవచ్చు.

క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇన్సూరెన్స్
చాలా మందికి తెలియని విషయం కార్డులకు బీమా ఉందని. నిత్య జీవితంలో జరిగే మోసాల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులకు రక్షణ కల్పించుకోవడం మంచి ఆలోచన. వన్ అసిస్ట్, సీపీపీ ఇండియా ఈ తరహా బీమా సదుపాయాలను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు ఈ బీమా సదుపాయం ఉంది. బ్యాంకు శాఖలో అడిగి తెలుసుకోవచ్చు.
ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు
షాపింగ్ చేసే సమయంలో లేదా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో కార్డును అక్కడి ఉద్యోగికి ఇవ్వగా... వారు స్వైప్ చేసిన తర్వాత పిన్ నంబర్ చెప్పేయడం ఎక్కువ మంది చేసే పని. పిన్ నంబర్ కార్డు దారుడికి మాత్రమే తెలిసి ఉండాల్సిన నంబర్. ఇతరులతో పంచుకునేది కాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ నంబర్ ను మీరే ఎంటర్ చేయండి.
ఆ ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు. క్రెడిట్ కార్డు సీవీవీ, ఎక్స్ పయిరీ, పాస్ వర్డ్ ఉంటే చాలు లిమిట్ మేరకు ఆన్ లైన్ షాపింగ్ చేసేసుకోవడం నిమిషాల్లో పని. క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తుండగా పిన్ నంబర్ చెప్పారనుకోండి, అక్కడున్న వాడు జాదూ అయితే సీవీవీ (చాలా మందికి దీన్ని చెరిపేసే అలవాటు లేదని పైన చెప్పుకున్నాం కదా), ఎక్స్ పయిరీ డేట్ ను క్షణాల్లో చూసేస్తాడు. ఇంకేముంది మీ కార్డు వాడి చేతిలో పడినట్టే. తర్వాత ఏదో ఒక రోజు అంతర్జాతీయ షాపింగ్ సైట్ నుంచి మీకో షాకింగ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ‘థ్యాంకు ఫర్ షాపింగ్ @...’ అని. అది చూసి బెంబేలెత్తడం ఖాయం.
సుధ బెంగళూరులోని ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగి. అన్నింటికీ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడడం అలవాటు. పైగా సీవీవీ నంబర్ ను చెరిపేయకుండా అలానే ఉంచేసింది. ఓ రోజు సుధ కళ్లు తిరిగే అంత పని అయింది. అమెరికాలోని ఓ గ్రోసరీ స్టోర్ లో 70వేల రూపాయల విలువైన షాపింగ్ ఆమె కార్డు పేరిట జరిగినట్టు రెండు లావాదేవీల ఎస్ఎంఎస్ లు వచ్చాయి. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కంప్లయింట్ ఇచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. కార్డ్ బ్లాక్ చేసేశారు. ఇన్వెస్టిగేషన్ లో తేలిందేమిటంటే బ్యాంకు తప్పిదం లేదని. దాంతో రూపాయితో సహా కట్టమని స్టేట్ మెంట్ పంపారు. అజాగ్రతగా ఉంటే మీరు కూడా సుధ వలే బాధపడాల్సి వస్తుంది.
కస్టమర్ కేర్ నంబర్ ను దగ్గర ఉంచుకోవాలి
ఏదైనా అనుమానిత, మోసపూరిత లావాదేవీ జరిగినట్టు గుర్తిస్తే వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయమని కోరాలి. ఇందుకోసం బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ ను ఫోన్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసి ఉంచుకోవాలి.

ఏటీఎం సెంటర్ లోనూ జాగ్రత్త
ఏటీఎం కేంద్రాల్లో పిన్ టైప్ చేసేటప్పుడు వేరే వారిని చూడనీయకండి. కార్డు సమాచారాన్ని కొట్టేయడానికి దొంగలు సైతం రహస్య కెమెరాలను అమర్చి ఉండవచ్చు. అందుకోసం ఒక చేత్తో పిన్ ను ఎంటర్ చేస్తున్న సమయలో రెండే అరచేతితో కవర్ చేయండి. అప్పుడు మీ పాస్ వర్డ్ వేరే కళ్లల్లో పడకుండా ఉంటుంది. చాలా మంది ఏటీఎంలో ఒక్కరే ఉంటే స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు. కానీ, అక్కడ నేరగాళ్ల రహస్య కెమెరాలు ఉండి ఉండవచ్చు. అజాగ్రత్త పనికిరాదు.
అర్ధరాత్రి ఏటీఎం లావాదేవీలు క్షేమకరం కాదు
నేరం జరిగేందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం అర్ధరాత్రి సమయాల్లో, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలను వినియోగించుకోవద్దు. రాత్రి 10 గంటల తర్వాత ఏటీఎం కేంద్రాలను ఆశ్రయించే విధానాన్ని వదిలిపెట్టాలి. డబ్బులతో పని పడితే గుర్తుంచుకుని రాత్రి 9 గంటల్లోపే డ్రా చేసుకోవాలి.  
కార్డులు వెంట ఉండాలా...?
అవసరం ఉన్నా లేకపోయినా అన్ని రకాల కార్డులను ఎప్పుడూ వ్యాలెట్లలో పెట్టుకుని తిరగడం అలవాటైపోయింది. కానీ, ఇది అంత సురక్షితం కాదు. అందుకే కార్డులతో పని ఉన్నప్పుడే వాటిని వెంట తీసుకెళ్లి మిగిలిన సమాయాల్లో ఇంట్లోనే ఉంచేయండి. అయితే, ఏ రోజు ఎక్కడ కార్డుతో అవసరం పడుతుందో తెలియదనుకుంటే... ఒక్క కార్డును మాత్రమే దగ్గర ఉంచుకుని మిగిలిన వాటిని ఇంట్లో ఉంచేయండి.
ఆన్ లైన్ లో సమాచారం విషయంలో జాగ్రత్త...
ఆన్ లైన్ లో పబ్లిక్ ఫోరమ్ లలో, సామాజిక మాధ్యమాలలో పుట్టినతేదీ, పాన్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఈ మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఇస్తుంటారు. కానీ వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన చోట తప్పితే ఇంకెక్కడా షేర్ చేయవద్దు.
రెండు దశల్లో పాస్ వర్డ్ లు
టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే ప్రతీ లావాదేవీకి ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ తో పాటు ఓటీపీ ఇస్తేనే ఓకే అయ్యేలా చేసుకోండి. దీనివల్ల లావాదేవీలకు మరింత భద్రత ఉంటుంది. అంటే రెండంచెల భద్రత అనమాట.
మెయిల్స్ తో జాగ్రత్త
బ్యాంకు లోగోతో, క్రెడిట్ కార్డు కంపెనీల పేరుతో వచ్చే మెయిల్స్ ను క్లిక్ చేయకండి.ట్రాప్ చేస్తారు. ఆ నకిలీ సైట్లో ఇచ్చే యూజర్ ఐడీ పాస్ వర్డ్, ఇతర కార్డు సమాచారాన్ని తస్కరించి మోసం చేసేస్తారు.  ఇలా చేయడానికి బదులు నేరుగా బ్యాంకు వెబ్ సైట్ అడ్రస్ ను టైప్ చేసి లాగిన్ అవ్వండి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం వెబ్ సైట్  https:// ఈ అక్షరాలతో ప్రారంభం కావాలి. అప్పుడే అది నిజమైనదని అర్థం.
నెట్ కేఫ్, ఇతరుల పీసీలకు దూరం
ఇంటర్నెట్ కేఫ్, ఇతరుల కంప్యూటర్ల నుంచి లావాదేవీలు చేసే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఆ కంప్యూటర్ల నుంచి ప్రమాదకర వైరస్ లను జొప్పించే వెబ్ సైట్లను యాక్సెస్ చేసి ఉండవచ్చు. ఆ కంప్యూటర్లలో అప్పటికే మాల్వేర్ లు ఇతరత్రా సైబర్ నేరగాళ్లు పంపిన సాఫ్ట్ వేర్ లు ఉండి ఉండవచ్చు. కీ లాగర్స్ అనే సాఫ్ట్ వేర్ యూజర్లు టైప్ చేసిన కీలను గుర్తుంచుకుంటుంది. ఆ సమాచారాన్ని నేరగాళ్లు తర్వాత దుర్వినియోగం చేస్తారు. ట్రోజన్ సాఫ్ట్ వేర్ లు సైతం కీలక సమాచారాన్ని కొట్టేస్తాయి. అందుకే యాంటీవైరస్ ఉన్న కంప్యూటర్లలోనే లావాదేవీలు చేయడం సురక్షితం.
ఇంటర్నెట్ వేగంగా ఉండాలన్న ఆలోచనతో కొంత మంది ఫైర్ వాల్ ను ఆఫ్ చేస్తారు. కానీ, ఇది ఆన్ లో ఉంటేనే రక్షణ ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ తో సిస్టమ్ ను స్కాన్ చేస్తూ ఉండాలి. మనం చూసే సాధారణ సైట్ల ద్వారా కూడా ట్రోజన్ సాఫ్ట్ వేర్ పీసీలోకి చొరబడే ప్రమాదం ఉంది. స్కాన్ చేస్తూ ఉండడం వల్ల వీటిని తొలగించుకోవచ్చు.
మొబైల్ లో లావాదేవీలు చేస్తున్నారా...?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. 3జీ, 4జీలు వచ్చే సరికి ఇప్పుడు చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ల నుంచే లావాదేవీలు చేసేస్తున్నారు. కానీ, మొబైల్ లోనూ యాంటీ వైరస్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే కంప్యూటర్ వలే మొబైల్ కూడా వైరస్ కు లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది.

ఓఎస్, బ్రౌజర్ అప్ డేట్ లో ఉండాలి
కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ తో పాటు, బ్రౌజర్లను అప్ టు డేట్ వెర్షన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే భద్రతా పరంగా మరిన్ని ఫీచర్లను ఎప్పటికప్పుడు జోడిస్తూ కొత్త వెర్షన్లను కంపెనీలు విడుదల చేస్తుంటాయి. వాటిని వాడుకోవడం వల్ల కంప్యూటర్ మరింత సురక్షితంగా ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవుతున్నారా...?
నెట్ బ్యాంకింగ్ లాగిన్ సమయంలో కీబోర్డు నుంచి పాస్ వర్డ్ లను టైప్ చేయకుండా బ్యాంకు సైటులో కనిపించే వర్చువల్ కీ బోర్డును సెలక్ట్ చేసుకోండి. అక్కడే కనిపించే లెటర్స్ ఆధారంగా మౌస్ సాయంతో పాస్ వర్డ్ ను ఎంటర్ చేయవచ్చు. ఇలా చేస్తే భద్రత ఉంటుంది. ఎందుకంటే కీబోర్డు ద్వారా ఎంటర్ చేసే కీలను పసిగట్టే సాఫ్ట్ వేర్ లను నేరగాళ్లు సైట్ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశపెడుతుంటారు. అందుకే కీబోర్డులో టైప్ చేయవద్దు. అదే సమయంలో వర్చువల్ కీ బోర్డులో పాస్ వర్డ్ ఇస్తున్న సమయంలో కంప్యూటర్ దగ్గర ఇతరులు ఎవరూ లేకుండా చూసుకోవాలి. వర్చువల్ కీ బోర్డు క్లిక్ చేసినప్పుడల్లా అందులో అక్షరాలు ఒక చోట నుంచి మరో చోటకు మారుతుంటాయి. కనుక సాఫ్ట్ వేర్లు పసిగట్టలేవు.
బ్యాంకు లావాదేవీలకు ప్రత్యేక బ్రౌజర్
బ్యాంకు లావాదేవీల వరకు ప్రత్యేక బ్రౌజర్ వాడడం కొంత వరకు భద్రంగా ఉంటుంది. ఉదాహరణకు అన్నింటికీ క్రోమ్ వాడే అలవాటు ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు లావాదేవీలను మాత్రం ఫైర్ ఫ్యాక్స్ లో చేయండి. ఈ బ్రౌజర్ ను లావాదేవీలకు తప్పిస్తే ఇతరత్రా సాధారణ బ్రౌజింగ్ కు వాడవద్దు. అదే సమయంలో బ్రౌజర్ లో పాస్ వర్డ్ లు, ఇంక ఇతర ఏ సమాచారం కూడా స్టోర్ అయ్యే అవకాశం లేకుండా డిజేబుల్ చేసి పెట్టుకోవాలి.